రాజకీయంగా ఆర్యవైశ్యులు ఎదగాలి: టీజీ వెంకటేశ్
విశ్వంభర, ముషీరాబాద్: దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని మాజీ ఎంపీ టీ.జీ. వెంకటేష్ సూచించారు. ఆదివారం ముషీరాబాదు ఆర్యవైశ్య హాస్టల్ భవనంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో భూపతి కృష్ణమూర్తి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వైశ్య ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీ.జీ. వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. రాజకీయాల్లో పార్టీలు, జెండాలు, రంగులు వేర్వేరు అయినప్పటికీ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.
ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వార్డ్ సభ్యుల నుంచి ఎంపీ స్థాయి వరకు రాజకీయంగా ఎదగాలని కోరారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉత్తర భారతదేశంలో బలంగా పనిచేస్తోందని, దక్షిణ భారతదేశంలో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు తమ సత్తా చాటాలని సూచించారు. ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులను సన్మానించారు. కొడంగల్ పట్టణానికి చెందిన స్థానిక రాజకీయ నాయకుడు. ప్రస్తుతం కొడంగల్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన నందారం ప్రశాంత్ ను సైతం ప్రత్యేకంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, గంజి రాజమౌళి గుప్తా, ఉప్పల స్వప్న, భాగ్యలక్ష్మి, కరుణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



