వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
విశ్వంభర, బషీర్ బాగ్: భారత్ జోడోయాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ జాబితాలో ఉన్న వడ్డెర కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వడ్డెర్ల గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డెరులను గాలికి వదిలేసిందని అన్నారు. సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. 24 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే వేలాది మంది వడ్డెరులను ఏకం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను అడ్డుకుని అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శిలు వరికుప్పల వెంకటేష్, కుంచపు దేవరాజు, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి డేరంగుల తిరుపతయ్య, ఉపాధ్యక్షులు చెరుకూరి ఇద్దయ్య, వంజల నాగేష్, రాష్ట్ర కార్యదర్శి సంపంగి రామకృష్ణ, వడిదల అంజయ్య, రంగారెడ్డి జిల్లా సలహాదారు ఓర్సు వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి రాజు ఓర్సు తదితరులు పాల్గొన్నారు.



