పెండింగ్ ఫైళ్ళను తక్షణమే పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్ అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గూగుల్ మీట్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైళ్లను, ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి తక్షణమే క్లియర్ చేయాలని, కార్యాలయాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు జవాబుదారీ తరంగా ఉంటూ సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పిల్లలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ ,భోజనం, డిన్నర్ చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు, కచ్చితంగా వసతి గృహాలను తనిఖీ చేసి, కామన్ డైట్ మెనూ, త్రాగునీరు, దుస్తులు, తదితర సౌకర్యాలను కచ్చితంగా తనిఖీ చేయాలని, వసతి గృహాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన "కీ "సంబంధిత అధికారి వద్ద ఉంచుకోవాలని సూచించారు. ప్రతి మెనూ గూగుల్ ఫోటో, జియో ట్యాగింగ్, తేప్పించుకోవాలని, షెడ్యూల్ ప్రకారం ఆర్బిఎస్కే, వైద్య క్యాంపుల ద్వారా పిల్లలకు భోజనం సిద్ధం చేసే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఆవుల పద్మ తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినదని అధికారులు తెలియజేయగానే తమకు ఉన్న పాత ఇల్లును కూల్చివేశామని కానీ ఇప్పుడు అది వేరే స్టేజీ లో ఉందని మంజూరు చేయలేదు తమకు పూర్వం ఎటువంటి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని తమ సమస్య పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామానికి చెందిన ఉప్పలయ్య తనకు శనిగపురం గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్లలోని భూమిని ఆన్ లైన్ చేసి తనకు కొత్త పట్టా పాసుపుస్తకము ఇప్పించగలరని అన్నారు. మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన కె.వెంకటాద్రి 2023 సంవత్సరంలో ప్రమాదం జరిగి కుడి కాలు, చేయి విరిగిందని తనకు సదరం ద్వారా జారీచేసిన సర్టిఫికేట్ ద్వారా వికాలాంగుల పించను ఇప్పించగలరని కోరారు. గార్ల మండల కేంద్రానికి చెందిన సుందర్ తాను పుట్టుకతోనే వికాలాంగుడినని తాను చిన్నపాటి ఉద్యోగంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉన్నదని తనకు గార్ల మండల కేంద్రంలో సి.ఎస్.సి కేంద్రానికి అనుమతించి తన కుటుంబం ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



