గాదె ఇన్నయ్యఇంట్లో విషాదం
48 గంటల బెయిల్ మంజూరు
మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం సాగరంలోని స్వగృహంలో థెరిసమ్మ వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు.
ఇటీవల ఇన్నయ్య అరెస్ట్ కావడం, ఆయన జైలులో ఉండటంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇన్నయ్యకు అనుమతి ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో తల్లి అంత్యక్రియల నిమిత్తం గాదె ఇన్నయ్యకు 48 గంటల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన శనివారం జరగనున్న అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు అందడంతో ఇన్నయ్య చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
గత కొద్దిరోజుల క్రితం జాఫర్గఢ్ మండల కేంద్రంలోని ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమంపై ఎన్ఐఏ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, నాలుగు వాహనాల్లో వచ్చి ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు.



