ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి 

ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి 

  • డీసీపీ రామ్ రెడ్డి

 విశ్వంభర, పెద్దపల్లి : రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై బాధ్యతాయుత దృక్పథం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం లో భాగంగా పెద్దపల్లి మండలం పరిధిలోని ఆర్.కే ఫంక్షన్ హాల్‌లో పెద్దపల్లి రూరల్ ఎస్ ఐ మల్లేశం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ  కృష్ణ , సీఐ పెద్దపల్లి ప్రవీణ్ కుమార్  ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతలో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. డిఫెన్సివ్ డ్రైవింగ్  ప్రాముఖ్యతను వివరించి, రోడ్డు పై పరిసరాలను గమనిస్తూ ఇతరుల పొరపాట్లను కూడా ముందుగానే అంచనా వేసుకుని జాగ్రత్తగా వాహనం నడపడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. అలాగే హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం నివారించడం వంటి ప్రాథమిక భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అధికారులు మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఈ అవగాహనను ఇతరులకు చేరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో, హాజరైన వారందరితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ  చేయించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మితిమీరిన వేగాన్ని నివారించడం, ఇతరులకు కూడా అవగాహన కల్పించడం వంటి అంశాలపై కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ, ప్రభుత్వ విభాగాలు, ప్రజలు, యువత మధ్య సమన్వయం పెంపొందించి, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్వో, ఎంపీడీఓ, ఎంఏఓ, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు  పాల్గొన్నారు.

Tags: