సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలి
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. డాక్టర్స్ ఫర్ యు ఎన్జీవో సహకారంతో హెచ్సిఎల్ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చిన అత్యాధునిక వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనరల్ హాస్పిటల్ కు అత్యాధునిక పరికరాలు అందించిన హెచ్సిఎల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు డొనేట్ చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పరికరాలు రోగి సంరక్షణ మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని బాగా పెంచుతాయని ప్రస్తుత రోజుల్లో ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకోలేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యధిక వైద్య పరికరాలు సమకూర్చుకోవడం వలన పేదవారికి వైద్యభారం తగ్గుతుందని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడ ప్రైవేటు హాస్పిటల్స్ కు దీటుగా వైద్యం లభిస్తుందనే నమ్మకం ప్రతి పేదవాడికి కలుగుతుందని తెలిపారు. దీనివల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని. హెచ్సిఎల్ వారి ఆలోచన వెనుకబడిన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ పట్ల నిబద్ధతను మరియు ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు డి ఎం ఈ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జయలత, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అదనపు డి ఎం ఈ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. శ్రావణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ హెచ్ సి ఎల్ ఫౌండేషన్ అసోసియేట్ డైరెక్టర్ సీమి సూరి, డాక్టర్ చేతన తీర్థహళ్లి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.



