ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు.
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేపలు, గొర్రెలపంపిణీ పేరిట వేలకోట్ల రూపాయలను తిన్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని ఎద్దేవా చేశారు. వందల ఎకరాలు ఉన్న వారికీ రైతుబంధు వేశారని 70వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.
మంత్రి పదవి రాలేదనే కారణంతోనే అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారని, అమాయకులను రెచ్చగొట్టారంటూ ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ భోజనం చేయాలంటూ రూ.లక్ష వసూలు చేసేవారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబం సోనియాగాంధీ కాళ్లు మొక్కారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. పంద్రాగస్టుకు తాము రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు.