అమ్మకు అమానుషం.. ఆస్తికోసం అంతిమయాత్ర ఆపిన కన్న పిల్లలు!
అమ్మ ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. అయితే అలాంటి అమ్మకు ఘోర అవమానం జరిగింది. అమ్మ చనిపోయిన ఆస్తి కోసం కన్న పిల్లలు ఏకంగా ఆమె అంతిమ యాత్రను ఆపివేసిన ఘటన సూర్య పేట జిల్లా కందులు వారి గూడెంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్నటువంటి వేము లక్ష్మమ్మ (80) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించింది.
ఈమెకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే లక్ష్మమ్మ వద్ద 20 తులాల బంగారు ఆభరణాలు, ఇరవై ఒక్క లక్షల విలువచేసే ఆస్తులు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల కోసం తన ఐదుగురు పిల్లలు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ తన తల్లి అంత్యక్రియలను కూడా పక్కన పెట్టారు.
ఆస్తి విషయం తేలేదాకా తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేది లేదని గత రెండు రోజులుగా తన తల్లి అంత్యక్రియలు జరపకుండా అడ్డుకున్నారు. గ్రామ పెద్దలతో కలిసి పంచాయతీ నిర్వహించిన ఈ గొడవ ఓ కొలిక్కి రాకపోవడంతో తన తల్లి అంత్యక్రియలను కూడా చేయకుండా ఉంచిన ఘటన చోటు చేసుకుంది. దీంతో వీరి వ్యవహార శైలిపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.