జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు
- ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించాలని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులను ఎస్పీ నరసింహ ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పునరుద్ధరణ, ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్లకు సంభందించి కొత్త బస్టాండ్ వద్ద సంబంధిత అధికారులతో కలిసి ఎస్పి పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో రహదారులపై ఉన్న ట్రాఫిక్ రద్దీని, రోడ్ల వెంబడి నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్ల పనులను వేగంగా పూర్తి చేయాలని, మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించేలా ప్రజలను వాహనదారులను ముందస్తుగా అప్రమత్తం చేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణకు సంబంధించి అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, ఆర్టీసీ అధికారులను సంప్రదించి జిల్లా కేంద్రంలో, కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు, మార్గాలను సులభతరం చేయాలని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పోలీస్ సిబ్బందిని బలోపేతం చేస్తామని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు రోడ్డు నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలకు గురవకుండా సురక్షితంగా గమ్యం చేరుకోవాలని అన్నారు. వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం నందు స్థానిక డిఎస్పి ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఉన్నారు.



