రహదారి విస్తరణ పనుల పరిశీలన
విశ్వంభర, షేక్పేట్ : జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాదు పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయెల్ డేవిస్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఈడీ, చీఫ్ ఇంజనీర్, ఖైరతాబాదు జోనల్ కమిషనర్, జిహెచ్ఎంసీ ఎస్ఈలతో కలిసి షేక్పేట్–టోలిచౌకీ కారిడార్లో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ తనిఖీలలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు, ఇంటర్నేషనల్ హై స్కూల్ నుంచి లక్ష్మీనగర్ వరకు రహదారి విస్తరణ, షేక్పేట్ ఎఫ్ఓబీ నుంచి టోలిచౌకీ ఎఫ్ఓబీ వరకు, అలాగే 7 టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా వరకు ఉన్న మార్గాలను పరిశీలించారు. నీటి నిల్వల తొలగింపు, డీ సిల్టింగ్, యుటిలిటీల మార్పిడి, అడ్డంకుల తొలగింపు, జంక్షన్ అభివృద్ధి, ఎఫ్ఓబీ పనులు, బీటీ రోడ్ల బలోపేతం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ చర్యల ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గించి, రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ఉందని తెలిపారు.



