ట్రాన్స్జెండర్ల ఆరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి
- అడిషనల్ కలెక్టర్ పాండు
విశ్వంభర, సంగారెడ్డి : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్నహెల్త్ వీక్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని అడిషనల్ కలెక్టర్ పాండు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి వర్గానికి సమానంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ట్రాన్స్జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అవసరమైన పరీక్షలు, చికిత్సలు అందించేందుకు ఇలాంటి ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ఎంతో అవసరమన్నారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డాక్టర్ శశాంక్, వైద్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



