కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విశ్వంభర, బచ్చన్నపేట: విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. శుక్రవారం బచ్చన్నపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ కెజిబివి ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంటశాల నుంచి విద్యార్థుల హాజరు వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.కిచెన్ను సందర్శించిన కలెక్టర్, కూరగాయల తాజాగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. ముఖ్యంగా వంట సరుకుల నాణ్యతతో పాటు, గుడ్లను నీటిలో వేసి మరీ అవి పాడయ్యాయో లేదో స్వయంగా పరీక్షించడం విశేషం.విద్యార్థుల వద్దకు వెళ్లిన కలెక్టర్.. ఉదయం అల్పాహారం ఏం పెట్టారు రుచిగా ఉందా అని ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలని సూచించారు.పాఠశాల ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.ఉపాధ్యాయులు,విద్యార్థుల హాజరు శాతంపై పాఠశాల ఎస్ఓ గీతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ గీత, ఉపాధ్యాయులు మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.



