ట్రాఫిక్ సమస్యలపై కమిషనర్ కలిసిన ఆరెకపూడి గాంధీ
విశ్వంభర, శేరిలింగంపల్లి: నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాదాపూర్లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, నియోజకవర్గంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ జి. సృజన కు వివరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ట్రాఫిక్ ఉన్న ప్రాంతంగా మారిందని, కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు రోజువారీగా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ సమస్యల పరిష్కారానికి భాగంగా పలు ముఖ్యమైన లింక్ రోడ్ల నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాలని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా హైటెక్స్ గౌసియా కేఫ్ నుండి కొత్తగూడ హర్ష టయోటా వరకు 100 ఫీట్ల రోడ్డు అపర్ణా హిల్ పార్క్ నుండి గంగారాం చెరువు సమీపంలోని హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ రహదారికి కలిపే లింక్ రోడ్డు ముంబై జాతీయ రహదారి కల్వర్ట్ నాల నుండి శ్రీదేవి థియేటర్ రోడ్డు వరకు లింక్ రోడ్డు ఈ పనులను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని, అసంపూర్తిగా మిగిలిపోయిన లింక్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ లింక్ రోడ్లు పూర్తి అయితే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రజలకు సమయం మరియు వాహనాల ఇంధనం ఆదా అవుతుందని, సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపారు.అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరమైన నిధులను మంజూరు చేయాలని, పనులలో వేగం పెంచాలని కోరారు. రోడ్ల మరమ్మత్తులు, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ విషయాలపై కమిషనర్ జి. సృజన సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.



