కొత్తవాడ చేనేత కార్మికులకు ప్రభుత్వం తీరని అన్యాయం. - రాపోలు వీర మోహన్
టెండర్ విధానం రద్దు చేయాలి . పాత పద్దతిలోనే చేనేత నిల్వలు కొనుగోలు చేయాలి .
- చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
- చేనేత కార్మికులను కాపాడుకునే భాద్యత ప్రభుత్వానిదే.
- ప్రభుత్వం తీరు పై ఆగ్రహం.
- త్వరలో చేనేత కార్మికుల పక్షాన రాష్ట్ర వ్యాప్త పర్యటన
విశ్వంభర, వరంగల్ :- తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ వరంగల్ లోని కొత్తవాడలో పర్యటించారు. కొత్తవాడలోని చేనేత సహకార సంఘాలను సందర్శించి చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ లో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు , కమిటీ ప్రతినిధి బృందం పర్యటించింది. వరంగల్ కొత్త వాడ చేనేత సహకార సంఘంను సందర్శించడానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు సంఘం అధ్యక్షులు మధనయ్య సాదర స్వాగతం పలికారు. అనంతరం సంఘంలోని చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించి కార్మికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘం లో నిల్వ ఉన్న వస్త్రాలను వివరాలు అలాగే రోజు వారి కూలి వేతనాలపై కూడా ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత వ్యవస్థపై అవలంబిస్తున్న తీరును ఖండిస్తూ , ప్రభుత్వం తీసుకొని వచ్చిన టెండరింగ్ విధానంపై ధ్వజమెత్తారు. రైతు , నేత అనేవి రెండు కళ్ళు లాంటివి అని అలాంటి నేపధ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తవాడ చేనేత కార్మికుల పై టెండరింగ్ విధానం తీసుకువచ్చి వారి కడుపు కొడుతుందని మండిపడ్డారు. చేనేతలకు గండంగా మారిన టెండర్ విధానం అమలు చేస్తే జరిగే నష్టాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి టెండర్ విధానమును రద్దు చేసి పాత పద్దతిలోనే కొత్తవాడ చేనేత నిల్వలను కొనుగోలు చేసి చేనేతకు అండగా ఉండాలని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులను సంఘటితం చేసి పోరాటానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశం లో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు చెరుకు మల్లయ్య, వేముల ఉమా రాణి, గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు ఏలే మహేష్ నేత , దాసరి సుధాకర్, మంత్రి కమలాకర్, చెన్నూరు విజయ లక్ష్మి, ఆడేపు నాగేష్, తురాయి రజిని, మీడియా రాష్ట్ర కార్యదర్శి రాంపల్లి లింగమూర్తి చేనేత సహకార సంఘం కార్యకర్తలు మరియు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



