పారిశుద్ధ్య సమస్యలపై జిహెచ్ఎంసి కమిషనర్ కు వినతిపత్రం
విశ్వంభర, శాలిబండ: శాలిబండ, కదిర్చమన్ డివిజన్లలో తీవ్ర పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయని బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నా వెంకట రమణ , జoగమెట్ మాజీ డివిజన్ అధ్యక్షుడు ఎం.జగదీష్ తెలిపారు. డివిజన్ల పునర్విభజన అనంతరం స్వీపింగ్ సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.దీంతో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. గతంలో యాకుత్పురా, చార్మినార్ సర్కిళ్ల నుంచి సిబ్బంది పనిచేసేవారని, కానీ పునర్విభజన తరువాత వారిని తిరిగి పంపడంతో ఈ సమస్య మరింత తీవ్రమైందని అన్నారు. గత 20 సంవత్సరాలలో జనాభా భారీగా పెరిగినా, పారిశుధ్య సిబ్బందిని పెంచకపోవడం పరిస్థితిని క్లిష్టం చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి వెంటనే: తగినంత స్వీపింగ్ సిబ్బందిని నియమించాలని , మలేరియా నివారణ దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని, అవసరమైన యంత్రాలు, సిబ్బంది అందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.



