ఎట్టకేలకు వీడిన సస్పెన్స్...తెలంగాణకు సోనియా రాక పై కీలక అప్ డేట్స్…
విశ్వంభర, ఢిల్లీ : ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి... ఇవాళ ప్రత్యేకంగా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాలకు రావాలని సోనియాగాంధీని ఆయన కోరారు. దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితులు, ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై ఆమెతో చర్చించినట్లు సమాచారం.
సోనియాతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని సోనియాను ఆహ్వానించానని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా పిలవాలని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం కృషి చేసిన ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై సోనియా సానుకూలంగా స్పందించారని తెలిపారు.