మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల బదిలీలు!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో పోలీస్ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. ఐదుగురు డీఎస్పీ (DSP) స్థాయి అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో పోలీస్ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. ఐదుగురు డీఎస్పీ (DSP) స్థాయి అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, సంబంధిత అధికారులు తమ పాత పోస్టింగ్ నుంచి రిలీవ్ అయి కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీజీపీఏ స్టాండ్స్లో డీఎస్పీగా, ఇల్లందు ఎస్డీపీఓగా విధులు నిర్వహిస్తున్న సారంగపాణిని ఖమ్మం జిల్లా వైరా ఏసీపీగా బదిలీ చేశారు. దీంతో ఆయన ఇల్లందు ఎస్డీపీఓ పోస్టింగ్ రద్దయ్యింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో డీఎస్పీగా ఉన్న పద్మనాభుల శ్రీనివాస్ను.. వైరా ఏసీపీ పోస్టు నుంచి తొలగించి, జీహెచ్ఎంసీ అదనపు ఎస్పీ ఖాళీ పోస్టులోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా ఉన్న యు. వెంకన్న బాబును ఇల్లందు ఎస్డీపీఓగా నియమించారు. సైబరాబాద్లో ఏసీపీ (ఎస్బీ)గా పనిచేస్తున్న ప్రకాశ్ను నిజామాబాద్ (టీ) ఏసీపీగా బదిలీ చేశారు. నిజామాబాద్ (టీ) ఏసీపీగా ఉన్న వెంకట్ రెడ్డిని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరంతా విధుల్లో చేరిన తర్వాత సీటీసీ నివేదికలు సమర్పించాలని సూచించారు.



