మూసీ పునరుజ్జీవనానికి అంకురార్పణ
దశల వారీగా చేపట్టనున్న భూసేకరణ
On
మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. నది పరివాహక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన భూములను సేకరించే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రారంభించింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. నది పరివాహక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన భూములను సేకరించే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాన్ని సుందరీకరించడంతో పాటు, పర్యాటక కేంద్రంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. మొత్తం 55 కిలోమీటర్ల మేర సాగే ఈ భారీ ప్రాజెక్టు కోసం దశలవారీగా భూసేకరణ చేపట్టనున్నారు.
తొలి విడతగా 50 ఎకరాల సేకరణ...
భూసేకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తొలి విడతగా రంగారెడ్డి జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాలపై దృష్టి సారించింది. ఈ రెండు మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని నిర్ణయించిన అధికారులు, దానికి సంబంధించిన సర్వే నంబర్లు, గ్రామాల జాబితాను నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఈ సేకరణ ప్రక్రియతో ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమం కానుంది. భూములు కోల్పోతున్న రైతులు, యజమానులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అభ్యంతరాలకు అవకాశం..
నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 3 జిల్లాలు, 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో సాగే ఈ ఆపరేషన్ ముగిశాక, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపుతో పాటు, నది ఇరువైపులా పచ్చదనంతో నిండిన ఉద్యానవనాలు, వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ జోన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మూసీ
మూసీ నదిని కేవలం శుద్ధి చేయడమే కాకుండా, నగర వాసులకు ఒక గొప్ప విడిది కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తయితే, వచ్చే కొద్ది నెలల్లోనే మూసీ తీరం కొత్త రూపును సంతరించుకోనుంది.
Tags: moosi



