రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా వినను : జగ్గారెడ్డి
- నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను..నా భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తారు
- సంగారెడ్డి నియోజవర్గంలో 84 గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకురండి..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిపించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా.
- అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి.. గెలిపించుకుని రండి.
- ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి.
- సంగారెడ్డిలో పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.
విశ్వంభర,సంగారెడ్డి : సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారినే అభ్యర్థులుగా నిలబెట్టాం” అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపడాలని, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారే గెలవాలని ఆయన సూచించారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, గ్రామాల్లో మాట్లాడుకుని నాయకులు, కార్యకర్తలే అభ్యర్థులను తుది నిర్ణయానికి రావాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చేర్చుకోబోమని స్పష్టం చేశారు.



