తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే గూటికి పన్నీర్‌ సెల్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే గూటికి పన్నీర్‌ సెల్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే  బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం అధికార పార్టీ అయిన డీఎంకేలో చేరారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే  బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం అధికార పార్టీ అయిన డీఎంకేలో చేరారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్టాలిన్ స్వయంగా సెల్వంకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సెల్వంతో పాటు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ రవీంద్రనాథ్, ఎమ్మెల్యే అయ్యప్పన్ , పెద్ద సంఖ్యలో అనుచరులు డీఎంకేలో చేరారు.

తేని అడ్డాగా కొత్త వ్యూహం.. బోడి మెట్టు నుంచి పోటీ?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓపీఎస్ తన సొంత నియోజకవర్గమైన తేనిలోని ‘బోడి మెట్టు’ నుంచి డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విధేయుడిగా పేరుపొంది, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సెల్వం చేరికతో దక్షిణ తమిళనాడులో డీఎంకే బలం మరింత పెరగనుంది. ముఖ్యంగా తేని జిల్లాలో ఆయనకున్న గట్టి పట్టు పార్టీకి కలిసి వస్తుందని స్టాలిన్ భావిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో దీర్ఘకాలంగా సాగుతున్న రాజకీయ విరోధం నేపథ్యంలో, ఈ పరిణామం పళనిస్వామి వర్గానికి గట్టి సవాలుగా మారనుంది.

Read More Crows Death: ఉన్నట్టుండి నేలరాలి చనిపోతున్న కాకులు..!!

బహిష్కరణ నుంచి డీఎంకే పయనం వరకు
2022లో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత పన్నీర్‌ సెల్వం రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. కొంతకాలం ఎన్డీయే కూటమితో కలిసి పనిచేసిన ఆయన, ఆ తర్వాత అక్కడా ఇమడలేక బయటకు వచ్చారు. తాజాగా డీఎంకేతో చేతులు కలపడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు కొత్త పునాది వేసుకున్నారు. జయలలిత వారసుడిగా తనను తాను చెప్పుకున్న నేత, ఇప్పుడు దశాబ్దాల కాలంగా ప్రత్యర్థిగా ఉన్న డీఎంకేలో చేరడం తమిళ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా అభివర్ణించవచ్చు. 

 

Related Posts