ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం
తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ బంధాలు వెల్లివిరిశాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ బంధాలు వెల్లివిరిశాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాల్సిందిగా చంద్రబాబును ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పెళ్లి పత్రికను అందజేసి, హైదరాబాద్లో జరగనున్న ఈ శుభకార్యానికి తప్పకుండా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ భేటీలో భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉండటంతో ఇరు రాష్ట్రాల నేతల మధ్య చర్చ ఆత్మీయంగా సాగింది.భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య వివాహం మార్చి 5వ తేదీన హైదరాబాద్ వేదికగా అత్యంత వైభవంగా జరగనుంది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడికి కూడా ఆహ్వానం
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం భట్టి విక్రమార్క ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని కూడా కలుసుకున్నారు. ఆయనకు కూడా కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, పెళ్లికి రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ భట్టికి అభినందనలు తెలియజేశారు. మరికొంతమంది ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులను కూడా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.



