తీరు మారకపోతే రైతుల బలాన్ని చూస్తారు.. కేటీఆర్ వార్నింగ్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఈ వెతలు ఏమిటని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారు? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేదని ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని కేటీఆర్ ప్రశ్నల వర్ష కురిపించారు.
నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు.. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వకపోతే ఎలా అని ట్వీట్ చేశారు. గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు.. 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా.. రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లని నిలదీశారు. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణలో అన్నదాతకే తిండి తిప్పలు లేకుండా చేస్తారా అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి...బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండని సూచించారు. లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని.. గ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.