భూగర్భ జలాలపై అవగాహన సదస్సు
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం మండలం, వెలిమెల గ్రామంలో భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ నీటి సదస్సు నిర్వహించింది. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ డి వైద్యనాథ్, సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖ మరియు మల్లేపల్లి బుచ్చిరెడ్డి, (పిఏసిఎస్) చైర్మన్ మాట్లాడుతూ, నీటి వృధాను అరికట్టాలని, ఇంకుడు గుంతల నిర్మాణం విరివిగా చేపట్టాలని, తద్వారా భూగర్భ జలాల సంరక్షణకు వీలవుతుందని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం భూగర్భ జలాల సంరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవిజికే ప్రసాద్ మాట్లాడుతూ, నీరే జీవనాధారం అని, "సేవ్ వాటర్-సేవ్ లైఫ్" అని నినాదం ఇచ్చి, అందరి చేత చెప్పించారు. సభాధ్యక్షులు జిల్లా భూగర్భజలశాఖ అధికారి డా .జి.మోహన్ మాట్లాడుతూ, యునెస్కో సంస్థవారు నీటి ప్రాముఖ్యతను తెలపడానికి 1993వ సంవత్సరంలో మార్చి 22వరోజును ప్రపంచ నీటి దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ రంగం భూగర్భ జలాలపై ఆధారపడి ఉందని, ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు పెంపొందించేందుకు రైతులు పొలాల్లో వర్షపు నీరును ఒడిసి పట్టడానికి, నీటి కుంటల నిర్మాణాలను చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రధానంగా భూగర్భజలాల వృధాను నియంత్రించడానికి, ఆరుతడి పంటలను ఎంచుకొని బిందు సేద్యం పద్ధతులను పాటించాలని తెలిపారు. అవగాహన కార్యక్రమాలతో రైతులకు, ముఖ్యంగా మహిళలకు భూగర్భజల సంరక్షణ పద్ధతులు, నీటి పొదుపు వివరాలను తెలియ చెప్పాలనేదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, రైతులు, వివిధ పరిశ్రమల యజమానుల చేత జిల్లా భూగర్భ జల అధికారి డా.జి.మోహన్ నీటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భ జలాలను ఉత్తమంగా నిర్వహిస్తున్నటువంటి (భూగర్భ జలాలు పెంపొందించడానికి ఉత్తమంగా కృషి చేస్తున్నటువంటి) మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఫార్మ్ డివిజన్ (ట్రాక్టర్ల డివిజన్), జహీరాబాద్, క్రమం తప్పకుండా, ప్రతినెలా భూగర్భజలాల వినియోగ రుసుమును విధిగా చెల్లిస్తున్నటువంటి హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్కి భూగర్భ జల శాఖ తరపున అవార్డులు ప్రదానం చేసారు . ఈ కార్యక్రమంలో సహాయ భూగర్భజల శాస్త్రవేత్తలు డా.సంతోష్ కుమార్, రవి కుమార్, బాలకృష్ణ ,ఎల్లన్న, వ్యవసాయ శాఖ అధికారులు శివకుమార్, రాణి, స్పందన, రోజా, ప్రణవి, సాయి మరియు మహేష్లు, కే.వెంకటరెడ్డి స్పెషల్ ఆఫీసర్, (పి వి సి ఎస్ )వెలిమల, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, కొమరయ్య, అగ్రికల్చర్ మార్కెటింగ్ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఖాజా పాషా, అలీ హుస్సేన్ లు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.



