పెద్దమ్మ తండాలో గ్రీన్ హోమ్ భూముల వివాదం
- డి.ఎల్.పి.ఓ జోక్యం, గ్రామపంచాయతీకి 10 శాతం భూమి రిజిస్ట్రేషన్కు ఆదేశాలు
విశ్వంభర, మహేశ్వరం : మండలం మహేశ్వరం పెద్దమ్మ తండా గ్రామంలో గ్రీన్ హోమ్ వెంచర్కు సంబంధించిన భూముల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత నెలలో 23వ తేదీన నేనావత్ రూప్ సింగ్, బాబు కలిసి కలెక్టర్కు సమర్పించిన ఫిర్యాదు మేరకు డి.ఎల్.పి.ఓ స్పందించి గ్రామపంచాయతీని సందర్శించారు. గ్రామంలో గ్రీన్ హోమ్ వెంచర్కు సంబంధించిన సుమారు 80 ఎకరాల భూమిలో 10 శాతం భూమి ఇప్పటివరకు గ్రామపంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ కాలేదని, ఆ భూములను విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన డి.ఎల్.పి.ఓ గ్రామపంచాయతీ తక్షణమే తీర్మానం చేసి ఆ 10% భూమిని గ్రామపంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. దీనికి సంబంధించి తగిన ఆదేశాలు సంబంధిత అధికారులకు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీకి చెందాల్సిన భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారికంగా గ్రామపంచాయతీ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవడం గ్రామానికి శుభ సూచకమని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి నాయక్, ఉప సర్పంచ్ కృష్ణనాయ, సీనియర్ నాయకులు కృష్ణ బాబు, రెడీయా గబ్లు, మంగేష్, గోపాల్, లోగేష్, తదితరులు పాల్గొన్నారు.



