Sabarimala Gold Theft Case: శబరిమల ప్రధాన పూజారి అరెస్టు..!!
Sabarimala Gold Theft Case: శబరిమల ఆలయంలో చోటు చేసుకున్న బంగారం తాపడాల చోరీ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ సంచలన కేసులో ఆలయ ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం అరెస్టు చేసింది.
Sabarimala Gold Theft Case: శబరిమల ఆలయంలో చోటు చేసుకున్న బంగారం తాపడాల చోరీ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ సంచలన కేసులో ఆలయ ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం అరెస్టు చేసింది. సిట్ కార్యాలయంలో తెల్లవారుజామున సుమారు 4.30 గంటల నుంచి రెండు గంటల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు అధికారికంగా వెల్లడించారు. అరెస్టు చేసిన అనంతరం రాజీవరును కొల్లం కోర్టులో హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 11కి చేరింది.
దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు రాజీవరుకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. శబరిమల ఆలయంలో బంగారు తాపడాల తొలగింపు, మళ్లీ అమరిక ప్రక్రియలో జరిగిన అక్రమాలకు రాజీవరు కూడా భాగస్వామిగా వ్యవహరించినట్టు విచారణలో తేలిన నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ తదితరులు, బంగారు పనుల కాంట్రాక్టును ఉన్నికృష్ణన్ పొట్టికి అప్పగించడంలో రాజీవరే కీలక పాత్ర పోషించారని తమ వాంగ్మూలాల్లో వెల్లడించినట్టు సిట్ పేర్కొంది. ఈ సమాచారంతోనే రాజీవరును విచారణకు పిలిపించి, ఆధారాలు సేకరించిన అనంతరం అరెస్టు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2019లో శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాలు మరియు శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడాలను తొలగించి తిరిగి అమర్చే పనులు చేపట్టారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ముందున్న బంగారం బరువుతో పోలిస్తే కొత్తగా అమర్చిన తాపడాల్లో బరువు తేడా ఉందని పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరడంతో కేరళ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది.
సిట్ దర్యాప్తులో బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ ఈ కేసుకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు తేలింది. దర్యాప్తు సమయంలో బెంగళూరులోని ఓ స్వర్ణాభరణాల దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ చేయడంతో కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ అరెస్టు చేసిన నిందితులపై ఈడీ కేసులు నమోదు చేసింది.
ఇలా శబరిమల బంగారం చోరీ కేసు రోజుకో కొత్త కోణంతో ముందుకు సాగుతుండగా, ఆలయ ప్రధాన అర్చకుడి అరెస్టు ఈ వ్యవహారాన్ని మరింత సంచలనంగా మార్చింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.



