ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టాలి
విశ్వంభర, నాగారం : సూర్యాపేట జిల్లా పరిధిలో నూతనంగా ఏర్పడిన నాగారం మండలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు వెంటనే చేపట్టాలని బి ఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బుర్రి సురేష్ రెడ్డి శుక్రవారం నాగారం మండల తాసిల్దార్ హరి కిషోర్ శర్మ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాగారం మండల ప్రభుత్వ కార్యాలయాల కొరకు గత సంవత్సరం తిరుమలగిరిలో జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ఇప్పటివరకు మొదలు పెట్టలేదన్నారు. నాగారం మండలం అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాగారం బంగ్లాలోని ఆర్ అండ్ బి 365 బి జనగామ సూర్యాపేట జాతీయ రహదారి పక్కన గల ఆర్ అండ్ బి బంగ్లాలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టే విదంగా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి కార్యాలయ నిర్మాణాలు చేపట్టే విధంగా చూడాలని తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నరేష్, ప్రశాంత్, బాను గణేష్ , తదితరులు పాల్గొన్నారు.



