ఉద్యోగులకు రూ.20 కోట్ల కార్ల కానుక

ఉద్యోగులకు రూ.20 కోట్ల కార్ల కానుక

రిటైల్ స్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హైలైట్ గ్రూప్ తన ఉద్యోగుల పట్ల ఉదారత చాటుకుంది. సంస్థ స్థాపించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కాలికట్‌లో నిర్వహించిన వేడుకల్లో యాజమాన్యం అదిరిపోయే కానుకలు ప్రకటించింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: రిటైల్ స్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హైలైట్ గ్రూప్ తన ఉద్యోగుల పట్ల ఉదారత చాటుకుంది. సంస్థ స్థాపించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కాలికట్‌లో నిర్వహించిన వేడుకల్లో యాజమాన్యం అదిరిపోయే కానుకలు ప్రకటించింది. కంపెనీ అభివృద్ధిలో వెన్నెముకగా నిలిచిన 47 మంది కీలక ఉద్యోగులకు ఏకంగా రూ.20 కోట్ల విలువైన ఖరీదైన కార్లను బహుమతిగా అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

1996లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్థానంలో మొదటి నుండి సేవలందించిన వారిని గుర్తించి ఈ గౌరవం కల్పించారు. పంపిణీ చేసిన వాహనాల్లో రేంజ్ రోవర్, ఆడీ క్యూ8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి లగ్జరీ కార్లతో పాటు టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ వంటి ప్రముఖ మోడళ్లు ఉన్నాయి. ఉద్యోగుల కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ఈ భారీ వ్యయాన్ని భరించినట్లు యాజమాన్యం పేర్కొంది.

Read More డిజిటల్ అరెస్ట్ భయం… వృద్ధ దంపతులకు రూ.14.85 కోట్ల నష్టం..!!

ప్రస్తుతం 10 వేల మంది ఉద్యోగులతో కొనసాగుతున్న హైలైట్ గ్రూప్ భవిష్యత్తుపై భారీ ప్రణాళికలను ప్రకటించింది. 2030 నాటికి సంస్థను మరింత విస్తరించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. త్రిశూర్, కాలికట్లలో ఇప్పటికే లగ్జరీ మాల్స్ నిర్వహిస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 మాల్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. సుమారు 680 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే పట్టాలెక్కించనుంది.