242 బెట్టింగ్ వెబ్సైట్స్ నిషేధం
ఆన్లైన్ గేమింగ్ చట్టం కింద కఠిన చర్యలు
దేశంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నెట్వర్క్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ‘ఆన్లైన్ గేమింగ్ చట్టం - 2025’ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న 242 అక్రమ వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నెట్వర్క్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ‘ఆన్లైన్ గేమింగ్ చట్టం - 2025’ నిబం ధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న 242 అక్రమ వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ వెబ్సైట్ల లింకులను వెంటనే తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. తాజాగా నిషేధించిన 242 సైట్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం 7,800కి పైగా అక్రమ ప్లాట్ఫాంలను కేంద్రం మూసివేయించింది.
అక్రమ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా, మానసిక సంఘర్షణకు లోనవుతున్నారని గుర్తించిన ప్రభుత్వం గత ఏడాది కాలంగా విరుచుకుపడుతోంది. మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న ఆఫ్షోర్ కంపెనీల వెబ్సైట్లను ప్రధానంగా టార్గెట్ చేశారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. "ఆన్లైన్ జూదం వల్ల ఎంతోమంది అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ ఉచ్చులో పడకుండా చూసేందుకు ఈ చర్యలు అత్యవసరం. కేవలం సైట్లను బ్లాక్ చేయడమే కాకుండా, వీటిని ప్రచారం చేసే సెలబ్రిటీలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.



