యువ వికాసం పథకాన్ని అమలు చేయాలి
విశ్వంభర, సిద్దిపేట: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన ‘యువ వికాసం’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షుడు కొండపలకల సంపత్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకొచ్చి రెండేండ్లు దాటినా ‘యువ వికాసం’, రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్తో పోల్చిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడా పవిత్ర గ్రంథాన్ని అమలు చేయకుండా యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 15రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో అసెంబ్లీ జనరల్ సెక్రటరీ బండారి శంకర్, అసెంబ్లీ సెక్రటరీ తాడురి నాగరాజు, నంగునూర్ మండల నాయకులు ఎనగందుల అజయ్ కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



