సంక్రాంతి తిరుగు ప్రయాణం: హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్!
హైదరాబాద్ బాటపట్టిన పల్లెవాసులు..
సంక్రాంతి సంబరాలు ముగించుకుని పల్లెవాసులు మళ్లీ భాగ్యనగరం బాట పట్టారు. ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65), అద్దంకి-నార్కట్పల్లి రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి సంబరాలు ముగించుకుని పల్లెవాసులు మళ్లీ భాగ్యనగరం బాట పట్టారు. ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65), అద్దంకి-నార్కట్పల్లి రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. అద్దంకి-నార్కట్పల్లి హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా పొందుగుల బ్రిడ్జి, దామరచర్ల, మిర్యాలగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఉంది. అటు విజయవాడ హైవేపై చిట్యాల, పెద్ద కాపర్తి, చౌటుప్పల్ ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసుల అప్రమత్తత.. దారి మళ్లింపులు ఇవే!
పంతంగి, కొర్లపహడ్ టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ, వాహనాల సంఖ్య వేలల్లో ఉండటంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్హెచ్-65 విస్తరణ పనులు జరుగుతుండటంతో పరిస్థితిని బట్టి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.
విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలను కోదాడ వద్దే నిలిపివేసి, వాటిని హుజూర్నగర్, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. అద్దంకి-నార్కట్పల్లి రోడ్డుపై వచ్చే వాహనాలను మిర్యాలగూడ వద్ద మళ్లించి.. హాలియా, మల్లేపల్లి మీదుగా హైదరాబాద్కు పంపిస్తున్నారు. చిట్యాల వద్ద రద్దీ పెరిగితే, వాహనాలను భువనగిరి మీదుగా హైదరాబాద్ చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
డ్రోన్లతో నిఘా..
ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీలను ఉపయోగిస్తున్నారు. టోల్ గేట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. హైవేపై రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.



