Hydra: రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూమిని రక్షించిన హైడ్రా..!!

Hydra: రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూమిని రక్షించిన హైడ్రా..!!

విశ్వంభర తెలంగాణ, బ్యూరో: రంగారెడ్డి జిల్లా మియాపూర్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని అక్రమ కబ్జాల నుంచి కాపాడటంలో హైడ్రా అధికారులు కీలకంగా వ్యవహరించారు.

విశ్వంభర తెలంగాణ, బ్యూరో: రంగారెడ్డి జిల్లా మియాపూర్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని అక్రమ కబ్జాల నుంచి కాపాడటంలో హైడ్రా అధికారులు కీలకంగా వ్యవహరించారు. శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబ్‌పేట గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 44కు చెందిన సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ విలువల ప్రకారం ఈ భూమి మార్కెట్ విలువ మూడు వేల కోట్ల రూపాయలకు మించినదిగా అంచనా వేస్తున్నారు. 

ఈ భూమి అక్రమంగా ఆక్రమణకు గురవుతోందని కొంతకాలంగా హైడ్రా ప్రజావాణి విభాగానికి ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే మొదటి దశలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో చెరువు కట్టపై నిర్మించిన 18 అక్రమ షెట్టర్లను తొలగించి ఆక్రమణలను అడ్డుకున్నారు.

Read More శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం

అయితే ఇదే భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో హైడ్రా మరోసారి లోతైన విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు గురయ్యారన్న వార్తలు రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సర్వే నంబర్ 159కు సంబంధించిన పాత పత్రాలను ఆధారంగా చూపుతూ, సర్వే నంబర్ 44లో ఉన్న మొత్తం 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ అక్రమ వ్యవహారంలో భాగంగా ఎకరంన్నర ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అనంతరం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మిగిలిన ఆక్రమణలను కూడా తొలగించారు. భవిష్యత్తులో మరలా కబ్జాలకు అవకాశం లేకుండా భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

అదేవిధంగా ఈ భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదేనని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అక్రమ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.