డిఐజి నుండి సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ
విశ్వంభర, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె నరసింహని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుండి ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీకి, అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు మట్టయ్య, నరసింహ చారి, ఏవో మంజు భార్గవి, సీఐ లు, ఎస్సై లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించి సిబ్బంది అందరూ జిల్లాల్లో శాంతిభద్రతల రక్షణకు, పౌరుల రక్షణకు, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై సత్వరం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని అన్నారు. అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని అక్రమ రవాణా పై ముందస్తుగా సమాచారం సేకరించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ నందు సిబ్బందికి క్రమశిక్షణ అనేది అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు, విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. మహిళలు, పిల్లలు సంభందించిన కేసుల్లో ప్రణాళిక ప్రకారం పని చేయాలి. పేకాట, గంజాయి తరలింపు, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు విధులు, కేసుల దర్యాప్తు, కేసుల నమోదు, స్టేషన్ నిర్వహణ పై క్షేత్ర స్థాయిలో నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు.



