హైదరాబాద్లో మరో భారీ మోసం.. ఏకంగా రూ. 80 కోట్లు స్వాహ
ఇటీవల తక్కువ ధరలకు ఫ్లాట్లు అంటూ కొందరు బిల్డర్స్ అమాయకులను మోసం చేస్తున్నారు. హైదరాబాద్లో ఇలాంటి మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో భారతీ లేక్వ్యూ పేరుతో భారతీ బిల్డర్స్ ఒక ప్రాజెక్టును చేపట్టారు. ప్రీలాంచ్ పేరుతో అమాయకులకు ఓ ఆఫర్ ప్రకటించి వల వేశారు. 6.23 ఎకరాల్లో తాము నిర్మాణాలు చేపడుతున్నామని నమ్మబలికారు. ఇందులో ఒక చదరపు అడుగును కేవలం రూ.3200కే ఇస్తామని చెప్పారు.
కస్టమర్లను ఆకర్శించడానికి కొంపల్లిలోని వెంచర్ సైట్తో పాటు మాదాపూర్లోని ఆఫీసుల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. దీంతో.. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఏకంగా వీళ్ల ఆఫర్ను నమ్మిన 350 మంది రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టారు. పెద్దమొత్తం డబ్బు వసూలు చేశారు కానీ..ఇప్పటివరకు నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. దీంతో.. భారతీ బిల్డర్స్ను పెట్టుబడిదారులు నిలదీశారు. అయితే వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో సైబరాబాద్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతీ బిల్డర్స్ చైర్మన్, ఎండీ, సీఈవోలను అరెస్టు చేశారు. ప్రస్తుతం భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈవో నరసింహారావు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసుతో పాటు భారతీ బిల్డర్స్ గతంలో చేపట్టిన నిర్మాణాలపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.