భారత సైన్యంలోకి ‘స్వదేశీ’ రోబో సైనికులు
నేవీ టెక్నాలజీతో ఆర్మీ బలోపేతం
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధనలో భాగంగా భారత సైన్యం రక్షణ రంగంలో సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. ప్రమాదకరమైన అగ్నిప్రమాదాల నుంచి సిబ్బందిని రక్షించేందుకు అత్యాధునిక ‘ఫైర్ ఫైటింగ్ రోబో’ లను కొనుగోలు చేసేందుకు శుక్రవారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధనలో భాగంగా భారత సైన్యం రక్షణ రంగంలో సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. ప్రమాదకరమైన అగ్నిప్రమాదాల నుంచి సిబ్బందిని రక్షించేందుకు అత్యాధునిక ‘ఫైర్ ఫైటింగ్ రోబో’ లను కొనుగోలు చేసేందుకు శుక్రవారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఐడెక్స్’ పథకం కింద ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
చారిత్రాత్మక ఒప్పందం
జనవరి 13, 2026న ఢిల్లీలోని క్యాపబిలిటీ డెవలప్మెంట్ డైరెక్టరేట్లో ఈ ఒప్పంద ప్రక్రియ ముగిసింది. అహ్మదాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ మెస్సర్స్ ‘స్వదేశీ ఎంప్రెసా ప్రైవేట్ లిమిటెడ్’ ఈ రోబోలను సరఫరా చేయనుంది. భారత సైన్యం, స్టార్టప్ రంగం మధ్య ఉన్న బంధాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేసింది. ఈ రోబోలను తొలుత భారత నౌకాదళం కోసం ఐడెక్స్ ఫ్రేమ్వర్క్ కింద అభివృద్ధి చేశారు. నౌకాదళం నిర్వహించిన పరీక్షల్లో ఈ రోబోలు అద్భుత ప్రదర్శన చేశాయి. నేవీ కోసం తయారు చేసిన పరిజ్ఞానాన్ని భారత సైన్యం సద్వినియోగం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇది త్రివిధ దళాల మధ్య ఉన్న సమన్వయాన్ని చాటిచెబుతోంది.
భారత సైన్యం కేవలం ఈ రోబోలకే పరిమితం కాకుండా, ఐడెక్స్ ద్వారా ఇప్పటికే డెలివరీ అయిన ప్రాజెక్టులను మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం మరో 22 అత్యాధునిక ప్రాజెక్టులు ట్రయల్స్ దశకు చేరుకున్నాయని, భవిష్యత్తులో యుద్ధ రంగంలో రోబోటిక్స్, ఏఐ పాత్ర మరింత పెరగనుందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.



