Bomb threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..!
బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లేందుకు రన్వేపై సిద్ధంగా ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
లోక్సభ ఎన్నికల వేళ దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు హెచ్చరికలు వచ్చాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లేందుకు రన్వేపై సిద్ధంగా ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానం టేకాఫ్ అవుతుందనంగా ఓ టిష్యూ పేపర్పై ‘బాంబు’ అని రాసిఉన్న నోట్ను విమానంలోని లావేటరీలో సిబ్బంది గుర్తించారు. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికుల్ని మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఇప్పటికే 13 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇదివరకు విమానాశ్రయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్)కి ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 3.05 గంటలకు సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎయిర్ పోర్టుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అనుమానాస్పదంగా ఏం కనిపించకపోవడంతో ఇది బూటకపు బెదిరింపులుగా తేల్చారు.