స్వదేశీ ఉత్పత్తుల వినియోగం కూడా దేశసేవలో ఒక భాగం -
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు స్వదేశీ జాగరణ మంచ్ స్వాగతిస్తోంది.
On
ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ ;- 1991లో స్వదేశీ జాగరణ మంచ్ స్థాపించినప్పటి నుండి, స్వదేశీ భావజాలాన్ని ప్రజల్లో నాటుతూ, ఆచరణలోకి తీసుకురావడానికి నిరంతర కృషి చేస్తోంది. స్వదేశీ, స్వావలంబనలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ద్వారానే భారతం శాశ్వత అభివృద్ధి సాధించగలదని స్వదేశీ జాగరణ మంచ్ విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న ఈ కాలంలో... వ్యాపార మార్గాలు, చెల్లింపు విధానాలు, కరెన్సీలు ఆయుధాలుగా మారుతున్నాయి. అమెరికా, పాశ్చాత్య దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంబిస్తూ అధిక పన్నులు, అన్యాయపూర్వక అడ్డంకులతో ప్రపంచ ఎగుమతులను అడ్డుకుంటున్నాయి. మరోవైపు, చైనా వంటి దేశాలు అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి అతి తక్కువ ధరలో, నాసిరకం వస్తువులను డంప్ చేస్తూ, మన తయారీ రంగాన్ని బలహీనపరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ ఆచరణ మన జాతీయ ప్రయోజనాలను కాపాడే ప్రధాన ఆయుధం.
విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, ముఖ్యంగా చైనా, టర్కీ వంటి శత్రుత్వ దేశాల వస్తువులు, సేవలను బహిష్కరించడం, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకు బదులుగా భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానిక ఉత్పత్తులు, శిల్పులను ప్రోత్సహించడం వంటి చర్యలు అవసరం. ఇవి దేశ ఆర్థిక శక్తిని పెంచి, స్థానిక ఉపాధి, వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. జూన్ 12, 2025న, వ్యాపార, పరిశ్రమ, సామాజిక సంస్థల సహకారంతో ప్రారంభించిన ‘స్వదేశీ సురక్షా ఔర్ స్వావలంబన్ అభియాన్’ ద్వారా స్వదేశీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా కొత్త ఊపు వచ్చింది. స్వాతంత్ర్య సమరంలో స్వదేశీ ఉద్యమం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం కాదు... ఆర్థిక గౌరవం, సాంస్కృతిక స్వాభిమానం, నాగరిక సార్వభౌమత్వం కోసం కూడా జరిగింది. ఆ ఉద్యమం విదేశీ వస్తువుల బహిష్కరణ, దేశీయ ఉత్పత్తి పునరుద్ధరణ, స్వావలంబన ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి పిలుపు ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి అవసరం. కోవిడ్ వ్యాక్సిన్ను మన దేశంలో తయారు చేసి కోట్లాది ప్రాణాలను రక్షించడం, రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం, అంతరిక్షం, డిజిటల్ రంగాల్లో స్వీయ శక్తిని చూపడం... ఇవన్నీ స్వదేశీ శక్తికి ఉదాహరణలు. చైనా తో మన వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఆందోళనకరం. చౌక, నాసిరకం వస్తువులు మన సూక్ష్మ పరిశ్రమలను దెబ్బతీస్తూ, ఉపాధిని నాశనం చేస్తున్నాయి. పైగా, ఈ ఆర్థిక లాభాలను చైనా సరిహద్దు దౌర్జన్యాలకు వినియోగిస్తోంది. మన సైనికులు సరిహద్దులో కాపలా కాస్తున్నప్పుడు, మనం శత్రువుల ఖజానాను నింపడం సరైందా అని ఆలోచించాలి ? అమెజాన్, వాల్మార్ట్ (ఫ్లిప్కార్ట్) వంటి పాశ్చాత్య ఈ-కామర్స్ దిగ్గజాలు 21వ శతాబ్దపు ఈస్ట్ ఇండియా కంపెనీలుగా మారాయి. ఇవి చిన్న వ్యాపారులను కిందికి నెడుతూ, విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. స్వదేశీ తత్వం ప్రపంచం నుండి వేరుపడటం కాదు. అది దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా విధానాలు, వ్యాపార నిర్ణయాలు, వినియోగపు అలవాట్లు ఉండాలనే సంకల్పం. ప్రతి రూపాయి దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయాలి... శత్రు దేశాల ఆకాంక్షలను లేదా భారత భవిష్యత్తుపై నిబద్ధత లేని సంస్థల లాభాలను పెంచకూడదు. అందుకోసం చైనా దిగుమతులపై నియంత్రణ, ఇతర దేశాలతో సముచిత వాణిజ్య ఒప్పందాలు, ఈ-కామర్స్ మోనోపోలీలపై నియంత్రణ, పీడన ధరలు, ప్రిఫర్డ్ సెల్లర్స్ విధానం, స్వంత బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయడం అవసరం. ప్రతి భారతీయుడు ‘స్వదేశీ సురక్షా ఔర్ స్వావలంబన్ అభియాన్’ లో భాగమై, స్వదేశీ ఆచరణతో భారతాన్ని మళ్లీ మహోన్నత దేశంగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని స్వీకరించాలి.
కర్నాటి శ్రీహరి
స్వదేశీ జాగరణ మంచ్ విభాగ్ కో కన్వీనర్
ఉమ్మడి నల్లగొండ జిల్లా.
9618010730



