వికలాంగులను నామినేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక చట్టం చేయాలి

చట్ట సాధనకై దశల వారీగా ఉద్యమం: అశాన్నగారి భుజంగరెడ్డి

వికలాంగులను నామినేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక చట్టం చేయాలి

విశ్వంభర, షాద్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లలో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక చట్టం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక  జిల్లా అధ్యక్షులు అశాన్నగారి భుజంగరెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు డిమాండ్ చేశారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలో స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 1నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లక్ష సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా షాద్‌నగర్ పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమన్ని అయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ డిసెబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ప్రకారం 43.02 లక్షల మంది (రాష్ట్ర జనాభాలో 12.02 శాతం) వికలాంగులున్నారు. రాష్ట్రంలో 2024 డిసెంబర్ నాటికి 12769  గ్రామ పంచాయతీలు, 130 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 540 మండల పరిషత్లు, 32 జిల్లా పరిషత్లు ఉన్నవి. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పంచాయతీ రాజ్ చట్టానికి మరియు మున్సిపల్ చట్టానికి సవరణలు చేసి, ఇద్దరు వికలాంగులను నామినేట్ చేసేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లలో సవరణలు చేసి, ప్రత్యేక చట్టం చేసి వికలాంగులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము. స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేస్తే గ్రామ పంచాయతీలలో 25,538 మందికి, మున్సిపాలిటీలలో 260 మందికి, మున్సిపల్ కార్పొరేషన్లలో 26 మందికి, మండల ప్రజా పరిషత్ లలో 1080 మందికి, జిల్లా పరిషత్లలో 64 మందికి రాజకీయ అవకాశాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల్లో వికలాంగులకు(నామినేట్) ప్రతినిత్యం కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షులు చేగురి శేఖర్ గౌడ్ ప్రదన కార్యదర్శి అబ్బే సంతోష మహిళ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: