ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇవాళ(బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు.
‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇవాళ(బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టడం పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ అర్ధరాత్రికల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. మే నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలింగ్ నమోదైంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవక పోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడతారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100మంది కౌంటింగ్ సూపర్వైజర్లతో పాటు కౌంటింగ్ అసిస్టెంట్లు 37మంది ఏఆర్వోలు, 40 మంది తహసీల్దార్లను, 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144సెక్షన్ అమలు చేశారు.