హిజాబ్ వ్యాఖ్యలు మంటపెట్టాయి.. ఒవైసీకి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్!!

హిజాబ్ వ్యాఖ్యలు మంటపెట్టాయి.. ఒవైసీకి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్!!

విశ్వంభర తెలంగాణ, బ్యూరో: భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ కూడా భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

విశ్వంభర తెలంగాణ, బ్యూరో: భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ కూడా భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందనే ఊహలకు ముందు, బురఖా ధరించిన మహిళను తమ పార్టీకి అధ్యక్షురాలిగా నియమించే ధైర్యం ఒవైసీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు.

ఆదివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించిన బండి సంజయ్, ఎంఐఎం పార్టీలో మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆ పార్టీ ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇచ్చిందని, కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లో మహిళలకు ఎంత స్థానం కల్పించిందని నిలదీశారు. మాటలతోనే మహిళా సాధికారత జరిగిందని చెప్పలేమని ఆయన విమర్శించారు.

Read More విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి.  - ఈ ఎల్ వి భాస్కర్

2018 ఎన్నికల సమయంలో పాతబస్తీలో అక్బరుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా బీజేపీ తరఫున షాజాదీ సయ్యద్‌ను పోటీకి దింపామని, అప్పట్లో ఆమెను బెదిరించి ఓడించారని సంజయ్ ఆరోపించారు. ప్రస్తుతం షాజాదీ సయ్యద్ జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. మహిళా సాధికారతపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఒవైసీ, తన పార్టీలోనూ వ్యక్తిగత జీవితంలోనూ మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు.

ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళల పేరుపై సంక్షేమ పథకాలు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గృహాలు వంటి చర్యల ద్వారా ముస్లిం మహిళలకు వాస్తవమైన సాధికారతను అందించింది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. ఈ కారణంగానే చాలా మంది ముస్లిం మహిళలు ప్రధాని నరేంద్ర మోదీని తమ సోదరుడిలా భావిస్తున్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా, భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిందని, అందువల్ల పాకిస్థాన్ వంటి దేశాలకంటే భిన్నంగా భారత్‌లో హిజాబ్ ధరించిన మహిళ కూడా ప్రధాని కావచ్చని అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా తీవ్ర వాదోపవాదాలకు దారితీశాయి.