మెడలో చెప్పుల దండలతో వికలాంగుల వినూత్న నిరసన
- పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నడిరోడ్డు పై నిరసన
- ప్రభుత్వం పై తమ పోరాటం ఆగదు - భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ .
చండూర్ , విశ్వంభర: పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా చండూరు ప్రధాన రహదారిపై చెప్పుల దండలు మెడలో వేసుకుని వినూత్న నిరసన చేపట్టారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగున విస్మరిస్తున్నారని ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు 6000 పెంచుతామని మొండి చెయ్యి చూపారని మండి పడ్డారు. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, వికలాంగుల సంక్షేమ శాఖను, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతోపాటు ప్రత్యేక అధికారులను నియమిస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు విస్మరించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 14 నెలలు గడుస్తున్న ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజంపై వివక్షను ప్రదర్శిస్తున్నారు అని మండి పడ్డారు. చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి, సంఘం జిల్లా మహిళా నాయకురాలు గుండెబోయిన అలివేలు, సంఘం మండల మహిళా అధ్యక్షురాలు కారంగుల రేణుక సంఘం, చండూరు మండలం ఉపాధ్యక్షులు పల్లగొని రవి, శ్రీకాంత్ సంఘం, తలారి సహదేవుడు, ఒంటెపాక ముత్తయ్య, సిద్దు, శివకుమార్, కృష్ణయ్య, శైలజ, కళావతి, నాగమణి, నాగమ్మ, గోవర్ధన్ రెడ్డి, ఈదా పరమేష్ తదితరులు పాల్గొన్నారు.



