యుద్ధ ప్రాతిపదికన SLBC పనులు: మంత్రి ఉత్తమ్
సొరంగం తవ్వకానికి అత్యాధునిక 'ఎలక్ట్రో మాగ్నటిక్' సాంకేతికత..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గమైన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
విశ్వంభర, బ్యూరో: ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం ఆశల ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గమైన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, ఇతర ఉన్నత స్థాయి ఇంజనీర్లతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గతంలో నిలిచిన పనులను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి వెల్లడించారు.
పాత టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) స్థానంలో, అత్యాధునిక సాంకేతికతతో కూడిన కొత్త యంత్రాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు.
సిబ్బందికి 25% అదనపు వేతనం
మిగిలి ఉన్న 9.8 కిలోమీటర్ల సొరంగ మార్గంలో భూగర్భ పరిస్థితులను అంచనా వేసేందుకు ఇప్పటికే 'ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే'పూర్తి చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. భూగర్భంలో అనూహ్య మార్పులను ఎప్పటికప్పుడు కనిపెట్టేలా పటిష్టమైన 'సపోర్ట్ సిస్టం' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే సిబ్బందికి 25 శాతం అదనపు వేతనం చెల్లిస్తామని మంత్రి ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో చేసిన నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ పనులు ఆలస్యమయ్యాయని,నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాకుండా, ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టడమే మా లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.



