వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: ప్రధాని మోడీ
విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు విపక్ష కూటమి ఎన్నికల బరిలో నిలిచిందని ధ్వజమెత్తారు.
విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు విపక్ష కూటమి ఎన్నికల బరిలో నిలిచిందని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, సమాజ్వాది పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ వైపు బీజేపీ, ఎన్డీయే కూటమి జాతి ప్రయోజనాలకు జీవితాలను అంకితం చేస్తుంటే.. ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు పోటీపడుతోందన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పేకమేడలా కూలిపోతుందని ఎద్దేవా చేశారు. జూన్ 4 ఎంతో దూరంలో లేదు... ఈ ఎన్నికల్లో మోడీ సర్కారు హ్యాట్రిక్ విజయం సాధించబోతోందని ప్రపంచమంతా నమ్ముతోందన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేరీలో పోటీ చేసే సాహసం చేయరని తాను ముందే ఊహించినట్లు ప్రధాని తెలిపారు. ఇప్పుడు అదే నిజమైందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ప్రధాని మోడీ అన్నారు. శ్రీరామనవమి రోజున రామమందిరంపై ఎస్పీకి చెందిన ఓ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారనీ.. అలాగే అయోధ్యపై సుప్రీంతీర్పును మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఒకవేళ ఎస్పీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు రామమందిరంపైకి బుల్డోజర్లను పంపి రామ్లల్లాను మళ్లీ టెంట్లోకి తీసుకొస్తారని ప్రధాని మోడీ మండిపడ్డారు.



