ఎన్నికల వేళ షాకింగ్.. 4.23 లక్షల ఓట్లు తొలగింపు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం ‘సర్’(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) తుది ఓటరు జాబితా విడుదల చేసింది. సర్ జాబితా ప్రకారం.. తమిళనాడులో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.7 కోట్ల మంది పురుషులు, 2.8 కోట్ల మహిళలు, 7,617 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. మరోవైపు 4.23 లక్షల మంది ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలె క్టర్లు(ఎన్నికల అధికారి) విడుదల చేశారు. ఈనెల 26, 27 తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం చైన్నెకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సైతం అర్చనా పట్నాయక్ బృందం కసరత్తు వేగవంతం చేశాయి. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్ఐఆర్).. తీవ్ర దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేపట్టి.. భారీ సంఖ్యలో ఓటర్ల జాబితాలో నుంచి పేర్లను తొలగించిన ఈసీ.. ఈసారి తమిళనాడులో 4.23 లక్షల ఓటర్లను తీసేసింది. ఈ పరిణామం ఇప్పుడు బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణం అవుతోంది.



