ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు
- సిపిఐ ఎంఎల్ సి నెల్లికంటి సత్యం
విశ్వంభర, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులారా ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ కార్మికుల సమస్యలను, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు ప్రజా సేవలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన గౌరవం, భద్రత, వేతనాలు అందకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి దుర్ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయడం, కార్మికులకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు.



