కరెంట్ వైర్లను వెంటనే సరిచెయ్యాలి
విశ్వంభర, మోత్కూరు : మోత్కూర్ మండలం రాగిబావి గ్రామంలో ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్ వైర్లను వెంటనే సరిచేయ్యాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి కోరారు. బుధవారం పార్టీ పిలుపు మేరకు సమస్యలపై పోరుబాటలో భాగంగా రాగిభావి గ్రామంలో సమస్యలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దత్తప్పగూడెం నుండి రాగిభావికి వెళ్లే దారికి పక్కన, రాగిబావి నుండి ముషీపట్ల గ్రామానికి వెళ్లే దారికి పక్కన మనుషులకు తాకే విధంగా ప్రమాదకరంగా ఉన్న కరెంట్ వైర్లను వెంటనే సరిచేయ్యాలని లేకుంటే జరిగే ప్రమాదాలకు సంబందించిన అధికారులే బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు. గ్రామంలో గ్రామ పంచాయితీ భవనం నిర్మాణం చెయ్యాలని, అన్ని వార్డులలో మురికి కాల్వలు, ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి నిధులను ప్రభుత్వం వివక్షత చూపించకుండా మంజూరు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, పానుగుల రమేష్, ఎన్నం వెంకట్ రెడ్డి, మెండు శేఖర్ రెడ్డి, పిట్టల చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.



