శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 10 విమానాలు రద్దు
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండటంతో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలపై తీవ్ర ప్రభావం పడింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండటంతో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. శనివారం ఒక్కరోజే సుమారు 10 అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా దుబాయ్, దోహా, అబుదాబి, మస్కట్, కువైట్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు తమ గల్ఫ్ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. గంటల తరబడి ఎయిర్పోర్ట్లోనే వేచి చూసిన ప్రయాణికులు, విమానాలు రద్దు కావడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
నిప్పుల కొలిమిగా పశ్చిమాసియా గగనతలం
యుద్ధం భీకర రూపం దాల్చడంతో ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు ఖతార్, యూఏఈ, కువైట్, బెహ్రయిన్ వంటి దేశాలు తమ ఎయిర్ స్పేస్ను పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఖతార్ రాజధాని దోహాలో పడటంతో అక్కడ భారీ విస్ఫోటనాలు సంభవించాయని ఆ దేశ రక్షణ శాఖ ధృవీకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ మార్గాలను మారుస్తున్నాయి. లుఫ్తాన్సా, విజ్ ఎయిర్ వంటి సంస్థలు మార్చి 7వ తేదీ వరకు తమ సర్వీసులను పూర్తిగా రద్దు చేశాయి. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఇజ్రాయెల్ గగనతలం మూసివేతతో గాలిలోనే వెనక్కి తిరిగి ముంబైలో ల్యాండ్ అయింది.
ప్రయాణికులకు హెచ్చరిక
ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా విమాన సర్వీసుల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 4-5 గంటల ముందే ఎయిర్లైన్ వెబ్సైట్లు లేదా హెల్ప్లైన్ ద్వారా విమాన స్థితిగతులను సరిచూసుకోవాలని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ సూచనలను పాటించాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. యుద్ధం మరింత ముదిరితే మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని విమానయాన నిపుణులు అంచనా వేస్తున్నారు.



