గూడ్స్ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు.. నలుగురు దుర్మరణం
ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది.
ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 23 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాగ్కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్ధుబిస్ నగరంలో ప్రైవేట్ రెజియోజెట్ కంపెనీకి చెందిన ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొంది. స్లోవేకియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న పశ్చిమ ఉక్రేనియన్ నగరమైన చాప్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలా మంది విదేశీయులు ఉన్నారు.
ఈ ఘటనతో తూర్పు భాగం గుండా ఒక ప్రధాన ట్రాక్ మూసివేయవలసి వచ్చిందని ఆ దేశ మంత్రి విట్ రాకుసన్ తెలిపారు. ప్రైవేట్ ట్రెరెజియోజెట్ కంపెనీ నిర్వహించే ఈ రైలు వెళ్తుండగా పార్డుబిస్ మెయిన్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగిందని చెక్ రిపబ్లిక్ దేశ రవాణా శాఖ మంత్రి మార్టిన్ కుప్కా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగుతుందన్నారు. ఇక, గూడ్స్ రైలు కాల్షియం కార్బైడ్ ను తీసుకువెళుతుందని స్థానిక అగ్నిమాపక శాఖ ప్రతినిధి వెందుల హోరకోవా పేర్కొన్నారు.