ఇళయరాజాకు 'పద్మపాణి' పురస్కారం
అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదానం
ప్రముఖ సంగీత జ్ఞాని, 'ఇసైజ్ఞాని' ఇళయరాజాను ప్రతిష్ఠాత్మక పద్మపాణి పురస్కారం వరించింది. ఈ విషయాన్ని అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
విశ్వంభర, సినిమా బ్యూరో: ప్రముఖ సంగీత జ్ఞాని, 'ఇసైజ్ఞాని' ఇళయరాజాను ప్రతిష్ఠాత్మక పద్మపాణి పురస్కారం వరించింది. ఈ విషయాన్ని అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు వారు వెల్లడించారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జరగనున్న చలనచిత్రోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పురస్కారంతో పాటు రూ.2 లక్షల నగదు బహుమతి, పద్మపాణి జ్ఞాపికతో పాటు గౌరవ పత్రం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ ప్రియులు హాజరుకానున్నారు.
గత విజేతలు..
గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న వారి జాబితాలో ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్, దర్శక-రచయిత్రి సాయి పరంజ్పే, దివంగత నటుడు ఓం పురి వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇళయరాజా చేరడం పట్ల సంగీత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



