కేయూ భూముల కబ్జా.. వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ
కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్కు గట్టి షాక్ తగిలింది. ఆయనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. గత కొంత కాలంగా విద్యార్థులు ఆందోళలు, నిరసనలతో కాకతీయ యూనివర్సిటీ రగులుతోంది. వీసీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.
వీసీగా తాటికొండ రమేశ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్రమాలు పెరిగిపోయాయని విద్యార్థులు ఆరోపించారు. ఆయనకు వీసీగా కొనసాగే అర్హతే లేదని ఆయన్ని తొలగించాలి డిమాండ్ చేశారు. వీసీగా ఆయన పాలనపై కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చార్జ్ షీట్ కూడా రిలీజ్ చేశారు. పీహెచ్డీ కేటగిరీ 1, 2 అక్రమాలు, కేయూ భూముల కబ్జాలు, వర్సిటీలో అక్రమ నియామకాలు, వీసీపై ఉన్న కేసులు, అక్రమ బదిలీల అంశాలను అందులో పొందుపరిచారు. రెండున్నరేళ్లగా వీసీ చేసిన అవినీతి, అక్రమాలపై కమిటీ వేసి విచారించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.
యూనివర్సిటీలో భూములు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయించరాదన్న నిబంధనలకు పక్కన పెట్టి ఏకంగా 183 ఎకరాలను అధికారులు లీజుకి ఇచ్చారు. మరో 175 ఎకరాల వర్సిటీ భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై విద్యార్థులు కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ భూకబ్జాల అంశానికి పీహెచ్డీ అడ్మిషన్ల అంశం అగ్నికి ఆజ్యం పోసినట్టు మారింది.
గతేడాది సెప్టెంబర్లో కేయూలో పీహెచ్డీ అడ్మిషన్లకు నోటిషికేషన్ రిలీజ్ అయింది. పైరవీలు, కాసులకు కక్కుర్తి పడి ఆఫీసర్లు వాటిని అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలను అడ్డుకోవడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.