వన మహోత్సవ కార్యక్రమం పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష
ఉద్యమంలా
వనమహోత్సవాన్ని చేపట్టాలి..
వారం రోజుల్లో టార్గెట్ రీచ్ కావాలి..
అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి..
విశ్వంబర కరీంనగర్ తేదీ 25/7/2024 : -తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
గురువారం కరీంనగర్ జెడ్పీ క్వార్టర్ల సముదాయంలోని సమావేశ మందిరంలో వన మహోత్సవ కార్యక్రమంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన లక్ష్యము.. నాటిన మొక్కల సంఖ్య... ఎప్పటి వరకు పూర్తి చేస్తారు తదితరు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిఆర్డిఓ, అటవీ, ఎక్సైజ్, ఆర్ అండ్ బి, పలు శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వన మహోత్సవంలో విధించిన లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారని, ఇది గమనించి అధికారులు ముందుకెళ్లాలని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలని, అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు. రహదారుల వెంట రైతు వేదికల్లో, అంగన్వాడీ సెంటర్లు, గ్రామాల్లో మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి..
వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
భీమా కల్పించేందుకు చర్యలు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
గ్రామాలు, పట్టణాలు అందంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అద్భుతమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.
గురువారం జెడ్పి క్వార్టర్ల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన పారిశుద్ధ కార్మికుల క్షేమం- గౌరవం అనే కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆరోగ్య బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, స్థానిక సంస్థల నిధుల నుంచి ఆరోగ్య బీమా చేస్తామని తెలిపారు.
విపత్కర పరిస్థితుల్లో మన గ్రామాలు, పట్టణాలు, వీధులు పరిశుభ్రత కోసం పారిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
వారికి ఆరోగ్య భీమా స్థానిక సంస్థల నిధుల నుంచి కల్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికులు రక్షణ కవచాలను ధరించి పని చేయాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎఫ్ఓ బాలామణి, యూనిసెఫ్ స్టేట్ ప్రతినిధి ఫణిందర్ కుమార్, డిపిఓ రవీందర్, డిఆర్డి ఓ శ్రీధర్, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి ఎస్ ఎస్ ఎన్ వేణు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉద్యాన వనాధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పలువురు అధికారులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.